వాషింగ్టన్, ఫిబ్రవరి 26: పాకిస్తాన్ పై ఉగ్రవాదుల విషయంలో అమెరికా రాయబారి నిక్కీ హేలీ పలు సంచలన నిర్ణయాలు తీసుకుంది. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చినంత కాలం పాకిస్తాన్ కు ఎటువంటి సహాయం చేయాకూడదని ఐక్యరాజ్యసమితిలో నిక్కీ హేలీ కోరారు. దయా గుణానికి ప్రతిఫలంగా అమెరికా కేవలం ఉగ్రవాదాన్ని రూపుమాపాలని మాత్రమే కోరుతోంది. కానీ అమెరికా, ఐరాస జోక్యాన్ని పాకిస్తాన్ వ్యతిరేకిస్తూనే ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా అమెరికా రక్షణను మరింత బలోపేతం చేసేందుకు ‘స్టాండ్ ఫర్ అమెరికా నౌ’ అనే నూతన పాలసీ గ్రూపును నిక్కీ హేలీ ప్రారంభించారు. ఇందులో భాగంగా.. ‘ 2017లో పాకిస్తాన్కు సుమారు 1 బిలియన్ డాలర్ల నిధులు అమెరికా సమకూర్చింది. ప్రపంచ దేశాల్లో అమెరికా సాయం పొందిన వాటిలో పాక్ ఆరో స్థానంలో ఉంది. అమెరికా అందించిన ఆర్థిక సహాయంలో ఎక్కువ శాతం నిధులు పాక్ తమ మిలిటరీకి వినియోగించింది. ప్రజల కోసం రోడ్లు, ఎనర్జీ ప్రాజెక్టులకు మిగిలిన మొత్తాన్ని ఉపయోగించింది. ఐక్యరాజ్యసమితిలో అమెరికాకు వ్యతిరేకంగా పాక్ చాలా విషయాల్లో ఓటు చేసింది. పాకిస్తాన్ను కట్టడి చేసేందుకు అమెరికా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై నిక్కీ ప్రశంసలు కురిపించారు. అయితే ఉగ్రవాదులను అంతమొందించేందుకు అమెరికా ఇంకాస్త కఠినంగా వ్యవహరించాల్సిన ఆవశ్యకత ఉందని ఆమె అభిప్రాయపడ్డారు.