హైదరాబాద్, ఫిబ్రవరి 26: అక్కినేని వారసుడు అఖిల్ కి సినీ పరిశ్రమలో ఇంకా సమయం కలిసి రాలేదు. అతను నటించిన మూడు సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. అయినా కూడా అఖిల్ నిరాశ పడకుండా హిట్ కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం అఖిల్ తన తర్వాతి సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్ళే పనిలో ఉన్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ బ్యానర్లో అఖిల్ సినిమా చేయబోతున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు నటీనటుల ఎంపిక జరుగుతోంది.
ఈ సినిమాలో హీరోయిన్ గా విజయ్ దేవరకొండ తో టాక్సీవాలా చిత్రంలో జోడీ కట్టిన ప్రియాంక జవాల్కర్ను తీసుకోవాలని చిత్ర బృందం భావిస్తుంది. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం రవితేజ హీరోగా తెరకెక్కుతున్న డిస్కోరాజా సినిమాలో నటిస్తోంది. త్వరలో లాంచనంగా ప్రారంభం కానున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ నుంచి మొదలు కానుంది.