న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: పుల్వామా దాడికి వ్యతిరేకంగా భారత్ ప్రతీకారం తీర్చుకోవడంతో యావత్ భారతావని హర్షం వ్యక్తం చేస్తోంది. సర్జికల్ స్ట్రైక్-2తో పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన భారత జవాన్లకు ఘన నివాళులర్పించిందని జాతి మొత్తం గర్విస్తోంది. భారత వైమానిక దళం చేసిన తాజా దాడుల్లో భారీ సంఖ్యలో ఉగ్రవాదులు హతమైనట్లు తెలుస్తోంది. దీనిపై పలువురు మాజీ క్రికెటర్లు, క్రికెటర్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ‘ జవాన్లు.. మీ ఆట అదిరింది’ అంటూ వీరేంద్ర సెహ్వాగ్ తన ట్వీటర్ అకౌంట్లో అభినందించాడు. ఇందుకు ఎయిర్స్ట్రైక్ హ్యాష్ ట్యాగ్ను జోడించాడు. మరొక మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ స్పందిస్తూ.. ‘ భారత్ ఆర్మీకి ఇదే నా సెల్యూట్’ అని ట్వీట్ చేశాడు. ఇక గౌతం గంభీర్ ‘జై హింద్ ఐఎఎఫ్’ అంటూ ట్వీట్ చేశాడు. టీమిండియా యువ క్రికెటర్ యజ్వేంద్ర చహల్ భారత ఆర్మీని ప్రశంసించాడు. పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది భారత జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. దేశం మొత్తాన్ని కలచివేసిన ఆ ఘటనకు ప్రతీకారంగానే ఉగ్రస్థావరాలపై భారత్ మరో మెరుపు దాడి చేసింది. ఈ ఘటనలో 200 నుంచి 300 ఉగ్రవాదుల వరకూ హతమైనట్లు సమాచారం.