న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: కర్ణాటకలోని మంగళూరుకు చెందిన జయరాం ప్రధాని నరేంద్ర మోదీకి వీరాభిమాని. ఈయన బీజేపీ కార్యకర్తగా పనిచేస్తున్నారు. మోదీ పట్ల అభిమానంతో పార్టీకి తన సేవలు అందిస్తున్నాడు. ఈ క్రమంలో ఆయనకు పెళ్లి కుదిరింది. దీంతో ఆయన ఓ విచిత్ర నిర్ణయం తీసుకున్నాడు. మోదీ మాటలే వేద మంత్రాలుగా భావించి వధువు మెడలో తాళి కట్టాడు.
జయరాం, మోదీ చేస్తున్న పాలనా తీరు, ఆయన ప్రవేశ పెడుతున్న పథకాలకు ఫిదా అయ్యాడు. ఈ నేపథ్యంలో తన అభిమాన నాయకుడిపై తన అభిమానాన్ని వినూత్న తరహాలో చెప్పాలనుకున్నాడు. అందుకు తన పెళ్లిని ఎంచుకున్నాడు. ప్రధాని 53వ మన్కీ బాత్(మనసులో మాట) కార్యక్రమం సమయాన్నే ముహూర్తంగా పెట్టుకుని పెళ్లికి ఏర్పాట్లు చేసుకున్నాడు. వివాహ వేదిక అయిన శూల్య పట్టణంలోని మహావిష్ణు మందిరంలో మన్కీ బాత్ వినేందుకు రేడియోతో పాటు స్పీకర్లను ఏర్పాటు చేశాడు. పెళ్లికి పంతులను కావాలనే జయరాం పిలవలేదు. మంత్రాలకు బదులుగా మైకుల్లో వినబడుతున్న మోదీ మాటలు వింటూ వధువు దమయంతి మెడలో తాళి కట్టాడు. అలా మోదీ మీద తన అభిమానాన్ని చాటుకున్నాడు.