ఆలయంలో ప్రసాదంగా మటన్ బిర్యాని పంచిపెడుతున్న పూజారులు....!

SMTV Desk 2019-02-25 18:55:29  Tamilnadu, Madhurai, Tirumangalam, Muneeshwarudi temple, Mutton biryani

తమిళనాడు, ఫిబ్రవరి 25: తమిళనాడు రాష్ట్రంలోని మధురై జిల్లా ఆవరణలోని మునీశ్వరుడి ఆలయంలో ఓ వింత ఆచారం జరుగుతోంది. ఆ గుడిలో ప్రసాదంగా మటన్ బిర్యానీని పెడతారంట. అంతేకాదు ముందు స్వామి వారికి నైవేద్యంగా పెట్టిన తర్వాతే భక్తులకు ప్రసాదంగా పంచిపెడుతున్నారు. గ్రామస్తుల కథనం ప్రకారం మధురై జిల్లా తిరుమంగళం సమీపంలోని వడుకంపట్టి గ్రామంలో గల మునీశ్వరుడి ఆలయంలో ప్రతి సంవత్సరం జనవరి 25వ తేదీన జరిగే ఉత్సవాల్లో మటన్ బిర్యానీని ప్రసాదంగా పంచుతారు. దీనిలో భాగంగా గతేడాది 2 వేల కిలోల బాస్మతీ బియ్యం, 200 మేక మాంసంతో బిర్యానీని తయారు చేసి ప్రసాదంగా అందించారు. ఈ ఏడాది కూడా ఇదే తరహలో స్వామి వారికి బిర్యానీ ప్రసాదాన్ని అందించారు. అయితే, దీని వెనుక ఓ మంచి పురాణ కథ ఉంది. 85 ఏళ్ల క్రితం ఎస్వీఎస్‌ సుబ్బానాయుడు అనే వ్యక్తి మునీశ్వరుడు పేరుతో ప్రారంభించిన హోటల్‌కు బాగా లాభాలు వచ్చాయి. ఆ హోటల్ లో మటన్ బిర్యానీ ప్రత్యేకం.

దాంతో ఆ స్వామికి రెండేళ్ల పాటు మటన్‌ బిర్యానీతో నైవేద్యం సమర్పించిన అనంతరం భక్తులకు ప్రసాదంగా పంచారట. అప్పటి నుంచి గ్రామస్థులంతా కలిసి బిర్యానీ తయారు చేసి ప్రసాదంగా పంపిణీ చేయడం ఆనవాయితీగా మారింది. ఇప్పుడు రాష్ట్రంలో వందల సంఖ్యలో మునియాండి మాంసాహార హోటళ్లు వెలిశాయి. ఇప్పుడు ఆ హోటళ్లు అక్కడ ఫుల్ ఫేమస్. బిర్యానీని బ్రేక్‌ఫాస్ట్‌గా తినడమన్నది ఈ ఆలయానికి చెందిన ప్రత్యేకతగా ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఎక్కడా ఎలాంటి వివక్ష లేకుండా అందరికీ బిర్యానీ ప్రసాదం అందిస్తామని చెప్పారు. వడక్కంపట్టిలో దాదాపుగా అందరూ ఈ బిర్యానీకి అభిమానులే అన్నారు.చిన్నా పెద్దా అంతా కలిసి ఆనందంగా ఉత్సవాల్లో పాల్గొంటారని తెలిపారు.