ఒంగోలు, ఫిబ్రవరి 25: వైసీపీ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డిని పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. అతనితో పాటు వైసీపీ, టీడీపీ కార్యకర్తలను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఒంగోలులోని కమ్మపాలెంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు బాలినేని శ్రీనివాస్ రెడ్డి వెళ్తున్న సమయంలో టీడీపీ కార్యకర్తలు అడ్డుకొన్నారు.
ఈ క్రమంలో రెండు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకొంది. రెండు పార్టీల కార్యకర్తలు పరస్పరం రాళ్లు, చెప్పులతో దాడులకు దిగారు. సుమారు మూడు గంటలకు పైగా రెండు పార్టీల మధ్య ఘర్షణ చోటు చేసుకొంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటనలో వైసీపీ నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. గొడవలో పాల్గొన్న రెండు పార్టీలకు చెందిన కార్యకర్తలను కూడ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో ఇద్దరు కానిస్టేబుళ్లకు కూడ గాయాలయ్యాయి.