మద్యం అనుకొని విషాన్ని తాగి మృత్యువాత పడ్డ కార్మికులు

SMTV Desk 2019-02-25 18:48:23  Alcohol poisoning kills 7, Vishakhanagaram, Gajuwaka

విశాఖనగరం, ఫిబ్రవరి 25: గాజువాకలో కొంతమంది కార్మికులు మద్యం అనుకొని విష ద్రవాన్ని సేవించారు. ఆ మందు తాగిన వారిలో మరణించిన వారి సంఖ్య 7కి చేరింది. 52వ వార్డులోని బ్రిడ్జి కింద నల్లని సీసాలో ఉంచిన ద్రవాలను మద్యంగా భావించిన 20 మంది దానిని సేవించారు. నాలుగు సంవత్సరాల క్రితం ఈ బ్రిడ్జి కింద నాటు సారాను తయారు చేసేవారు ఉండటంతో ఇదే మద్యం క్యాన్‌గా వారు భ్రమించారు. దానిని సేవించిన వెంటనే వారు వాంతులు, విరోచనాలతో కేజీహెచ్‌లో చేరారు.

అప్పటికే ఆ రసాయనాలు రక్తంలో కలిసిపోవడంతో నలుగురు మరణించారు. చికిత్స పొందుతూ మరో ముగ్గురు సోమవారం ప్రాణాలు కోల్పోయారు. దీనిపై జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... ఆ విష పదార్థం వచ్చిన వాసనను బట్టి అది మద్యం కాదని భావిస్తున్నామని, పారిశ్రామిక అవసరాలకు వినియోగించే స్పిరిట్ కెమికల్‌గా అనుమానిస్తున్నట్లు వెల్లడించారు. ఎక్సైజ్, పోలీస్ శాఖలు సంయుక్తంగా విచారణ చేపట్టాయని ప్రకటించారు. మరణించిన వారిలో అత్యధికులు 50 ఏళ్లు పైబడిన వారేనని పోలీసులు తెలిపారు.