హైదరాబాద్, ఫిబ్రవరి 25: భరత్ అనే నేను సినిమా తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా చేస్తున్న సినిమా మహర్షి . మహేష్ 25వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించగా దిల్ రాజు, అశ్వనీదత్, పీవీపీలు భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో మహేష్ కాలేజ్ స్టూడెంట్ గా, ఓ పెద్ద సంస్థకి సీఈఓ గా, రైతుగాను మూడు డిఫరెంట్ లుక్స్ తో కనిపించనున్నాడు. తాజాగా హైదరాబాద్ - శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో జరగనున్న ఈ సినిమా షూటింగుకి అనుకోని అవాంతరం ఎదురైంది.
ఆదివారం ఉదయం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో షూటింగ్ చేసుకోవడానికి మహర్షి టీమ్ అధికారుల నుంచి ముందుగానే అనుమతులు తీసుకుంది. అయితే భద్రతా సంబంధమైన కొన్ని సమస్యల కారణంగా, అధికారులు తాము ఇచ్చిన అనుమతులను రద్దు చేశారు. హై అలర్ట్ ప్రకటించిన కారణంగా, అధికారులతో సంప్రదింపులు జరిపినా ప్రయోజనం లేకుండాపోయింది. దాంతో 5 గంటలపాటు తన క్యారవాన్ లో నిరీక్షించిన మహేశ్ బాబు, ఓపిక నశించడంతో తిరిగి వెళ్లిపోయినట్టుగా తెలుస్తోంది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాకి, దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు.