కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించిన ప్రియాంక గాంధీ ఈనెల 28న తొలిసారిగా గుజరాత్లో భారీ ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. మూడు దశాబ్ధాల నుంచి అధికారానికి దూరంగా ఉన్న గుజరాత్లో పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ, తల్లి సోనియా గాంధీతో కలిసి ఆమె ఈ ర్యాలీలో పాల్గొననుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.
ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్లో బీజేపీకి గట్టిపట్టు ఉండటం గమనార్హం. కాగా, అహ్మదాబాద్లో జరిగే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశానంతరం ఈ ర్యాలీ జరగనుందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశంలో, అదే రోజు జరిగే ర్యాలీలో ప్రియాంక మొదటిసారిగా పాల్గొననుండటంతో పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేపట్టాయి.