లక్నో, ఆగష్టు 3: గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పనితీరుపై ప్రజలు, ప్రతిపక్షాలు వివిధ రకాలుగా నిరసనలు తెలుపడం తెలిసిందే. తాజాగా టమాటా రేటు పెరుగుదలపై ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ నేతలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. వివరాల్లోకి వెళితే... లక్నోలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ టమాటా పేరుతో ఒక బ్యాంక్ ను ప్రారంభించారు. `అర కేజీ టమాటాలను డిపాజిట్ చేస్తే ఆరు నెలల తర్వాత కేజీ టమాటాలు ఇస్తాం` అంటున్నారు. ఈ సంస్థలో టమాటాల కోసం లాకర్లు, టమాటాలు తాకట్టు పెట్టుకుని లోన్లు, పేదవారికి ప్రత్యేక వడ్డీరేట్ల సదుపాయాన్ని ఏర్పాటు చేసామని ప్రకటించారు. మిగతా బ్యాంక్ల మాదిరిగానే ఈ బ్యాంక్ కూడా ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పనిచేస్తుందని వెల్లడించారు. ఈ బ్యాంక్లో టమాటాలు డిపాజిట్ చేసి అకౌంట్ ఓపెన్ చేయండి, ధరల పెంపుపై ప్రభుత్వానికి నిరసన తెలియజేయండంటూ ప్రజలకు కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చారు.