అమరావతి, ఫిబ్రవరి 25: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో పార్టీ నాయకుల వలసలు జోరుగా సాగుతున్నాయి. ఇటీవల కొందరు నాయకులూ టీడీపీని వీడి ప్రతిపక్షంలో చేరిన సంగతి తెలిసిందే. కాగా చాలా రోజులుగా వస్తున్న ఊహాగానాలకు మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ తెరదించనున్నారు.
త్వరలోనే ఆయన టీడీపీ తీర్ధం పుచ్చుకోనున్నరు. విశాఖపట్టణం రైల్వే జోన్ సహా ఏపీకి జరుగుతున్న అన్యాయంపై తరచూ స్పందిస్తున్న ఆయన రైల్వే జోన్ కోసం నిర్వహించిన ఆందోళనలోనూ పాల్గొన్నారు. కొణతాల త్వరలోనే టీడీపీలో చేరబోతున్నారంటూ గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి.
వాటికి తెరదించుతూ ఈ నెల 28న ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో సమావేశం కానున్నట్టు సమాచారం. వచ్చే ఎన్నికల్లో ఆయన అనకాపల్లి నుంచి టీడీపీ లోక్ సభ అభ్యర్థిగా బరిలోకి దిగే అవకాశం ఉందని సమాచారం. చంద్రబాబుతో భేటీలో అనకాపల్లి సీటు గురించి చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.