కర్నూల్, ఫిబ్రవరి 24: ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చేందుకు తాను రాజకీయాల్లోకి వచ్చానని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. ఆదివారం కర్నూలులో సి. క్యాంపు సెంటర్ నుంచి కొండారెడ్డి బురుజు వరకు రోడ్ షో నిర్వహించారు. ఈ నేపథ్యంలో మాట్లాడిన పవన్, జగన్లా తాను 30 ఏళ్లు సీఎంను కావాలనుకోవడం లేదని, సీఎం చంద్రబాబులా తన కొడుకుని ముఖ్యమంత్రిని చేయాలనుకోవడం లేదని అన్నారు. ప్రజల జీవితాల్లో మార్పు కోసమే తన పోరాటమని, గెలిపించి ముఖ్యమంత్రిని చేస్తారో, లేక ప్రతిపక్షంలో కూర్చోబెడతారో మీ ఇష్టమని అన్నారు. జనసేన లేకుండా భవిష్యత్ రాజకీయాలు ఉండబోవని కొండారెడ్డి బురుజు సాక్షిగా చెబుతున్నానని పవన్ అన్నారు. ఎప్పుడూ కూడా ఒకే వ్యక్తికి అధికారం ఇస్తే పాలన అస్తవ్యస్తంగా మారుతుందని, అందుకే సంకీర్ణ ప్రభుత్వాలు రావాల్సిన అవసరం ఉందన్నారు. అధికార, ప్రతిపక్ష నేతల మేనిఫెస్టోలు చూస్తుంటే సిగ్గేస్తోందని పవన్ అన్నారు. రాష్ట్ర బడ్జెట్కు రెండింతల వరకు హామీలు ఇస్తున్నారని అన్నారు. చంద్రబాబు, జగన్లా తాను దిగజారుడు రాజకీయాలు చేయనని, అబద్ధాలు చెప్పబోనని పవన్ స్పష్టం చేశారు.