అమరావతి, ఫిబ్రవరి 25: వరుసగా రాయలసీమ ప్రాంతాల్లో పర్యటిస్తున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆదివారం కర్నూలు జిల్లా సందర్శించారు. జిల్లాలోని సి. క్యాంపు సెంటర్ నుంచి కొండారెడ్డి బురుజు వరకు రోడ్ షో నిర్వహించారు.
ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ...... తాను రాజకీయాల్లోకి వచ్చింది ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చేందుకేనని, జగన్లా తాను 30 ఏళ్లు సీఎంను కావాలనుకోవడం లేదని, సీఎం చంద్రబాబులా తన కొడుకుని ముఖ్యమంత్రిని చేయాలనుకోవడం లేదని అన్నారు. గెలిపించి ముఖ్యమంత్రిని చేస్తారో, ప్రతిపక్షంలో కూర్చోబెడతారో మీ ఇష్టమని అన్నారు.
జనసేన లేకుండా భవిష్యత్ రాజకీయాలు ఉండబోవని కొండారెడ్డి బురుజు సాక్షిగా చెబుతున్నానని పవన్ అన్నారు. ఎప్పుడు కూడా ఒకే వ్యక్తికి అధికారం ఇస్తే పాలన అస్తవ్యస్తంగా మారుతుందని, అందుకే సంకీర్ణ ప్రభుత్వాలు రావాల్సిన అవసరం ఉందన్నారు. అధికార, ప్రతిపక్ష నేతల మేనిఫెస్టోలు చూస్తుంటే సిగ్గేస్తోందని పవన్ అన్నారు. రాష్ట్ర బడ్జెట్కు రెండింతల వరకు హామీలు ఇస్తున్నారని అన్నారు. చంద్రబాబు, జగన్లా తాను దిగజారుడు రాజకీయాలు చేయనని, అబద్ధాలు చెప్పబోనని పవన్ స్పష్టం చేశారు.