అమరావతి, ఫిబ్రవరి 22: ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నవేళ అధికార తెలుగు దేశం పార్టీ(టీడీపీ)లో టికెట్ల సందడి నెలకొంది. ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో పోటిచేయబోయే నాయకులను ఆచితూచి ఎన్నుకుంటున్నారు. ఇప్పటికే కొంతమంది నాయకుల పేర్లను కూడా ఆయన ప్రకటించారు. వచ్చేనెల మొదటి వారంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉండగా, అభ్యర్థుల పేర్లను ఖరారు చేసే పనిలో చంద్రబాబు ఉన్నారు. చిత్తూరు జిల్లా ఎంపీ శివప్రసాద్ పెద్దల్లుడు గుంతాటి వేణుగోపాల్ కూడా చంద్రబాబును కలసి వినతి పత్రాన్ని అందించారు. సత్యవేడు నియోజకవర్గ టికెట్ ను కేటాయించాలని వేణుగోపాల్ కోరారు. ఇప్పటి వరకు తాను చేసిన సేవలను కూడా బాబుకు వివరించారు. వ్యాపారవేత్త అయిన వేణుగోపాల్ పలు సినిమాలను కూడా నిర్మించారు. మరోవైపు, ఎంపీ శివప్రసాద్ రెండో అల్లుడు నరసింహ ప్రసాద్ కు రైల్వే కోడూరు అభ్యర్థిత్వం ఖరారైంది.