జమ్మూ కాశ్మీర్, ఫిబ్రవరి 22: జమ్మూకాశ్మీర్ లో ఉగ్ర మూకలు యువతను ఉగ్రవాదం వైపు మళ్ళించేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో కశ్మీర్లో ఉగ్రవాద నిర్మూలనకు ప్రభుత్వం పలు ప్రణాళికలు రూపొందిస్తుంది. నిరుద్యోగం కారణంగా యువత ఉగ్రవాదంపై మల్లడానికి ఆసక్తి చూపుతున్నారని ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలో ఉగ్రబాట పట్టాలనుకునే యువత కోసం ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించనుంది. వారు తుపాకీని వదిలేసి, జనజీవన స్రవంతిలో కలిస్తే రూ. 6 లక్షల నగదుతోపాటు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇవ్వాలని భావిస్తుంది.
అణచివేత చర్యలతోపాటు, యువతకు మరిన్ని ఉపాధి అవకాశాల కల్పన, ఇప్పటికే ఉగ్రవాదులుగా మారిని వారిని లొంగిపోయేలా చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని హోంశాఖ అధికార వర్గాలు తెలిపాయి. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో ఈ చర్యలను మరింత ముమ్మరం చేయాలని నిర్ణయించినట్లు తెలిపాయి. లొంగిపోయే ఉగ్రవాదులకు రూ. 6 లక్షల నగదును వారి పేరుతో బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని, గడువు తర్వాత వడ్డీతోపాటు వారు తీసుకునేలా ప్రతిపాదన తాయారు చేశామని హోం శాఖ అధికార వర్గాలు తెలిపాయి. ఉగ్రవాదులు ప్రభుత్వ అధికారులు, పోలీసులు, సైనిక ఉన్నతాధికారులకు ఆయుధాలు అప్పగించి లొంగిపోవాల్సి ఉంటుందని, లోక్సభ ఎన్నికల్లోపు పూర్తి వివరాలతో కేంద్రం ప్రకటన వెలువరిస్తుందని వివరించాయి.