షేర్లు బైబ్యాక్ చేస్తున్న టెక్ మహీంద్రా..

SMTV Desk 2019-02-21 20:45:43  Tech Mahindra Ltd., buy back, Equity shares

ముంబై, ఫిబ్రవరి 21: ప్రముఖ సాఫ్ట్ వేర్ దిగ్గజ కంపెనీ టెక్ మహీంద్రా తన సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో టెక్ మహీంద్రా లిమిటెడ్‌ బోర్డు బైబ్యాక్‌ ప్రతిపాదను ఆమోదం తెలిపింది. రూ.1956 కోట్ల విలువైన షేర్ల కొనుగోలుకు ఆమోదం లభించినట్టు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ఈరోజు తెలిపింది.

ఒక్కొక్క షేరుకు రూ.950 చొప్పున 2.05 కోట్ల ఈక్విటీ షేర్లను బైబ్యాక్ చేస్తామని కంపెనీ వెల్లడించింది. ఇది 2.1 శాతం ఈక్విటీ వాటాకు సమానం. ఇందుకు రూ.1956 కోట్లను వెచ్చించనున్నట్లు తెలిపింది. ఇందుకు కంపెనీ అంతర్గత వనరుల నుంచి నిధులను వినియోగించనున్నారు. ఈ బైబ్యాక్‌లో కంపెనీ ప్రమోటర్లు పాల్గొంటారా? లేదా? అనే విషయంపై స్పష్టత లేదు. టెక్ మహీంద్రా షేరు ప్రస్తుత ధరతో పోలిస్తే 14.59 ప్రీమియం ధరలో బై బ్యాక్‌ చేపడుతున్నట్టు పేర్కొంది. బైబ్యాక్‌కు మార్చి 6 రికార్డ్‌ డేట్‌గా ప్రకటించింది. ఈ ప్రకటన నేపథ్యంలో ప్రస్తుతం టెక్‌ మహీంద్రా 2.1 శాతం లాభాల్లో రూ.830 స్థాయి వద్ద కొనసాగుతోంది. అంతకుముందు రూ.840 వద్ద 52 వారాల గరిష్టాన్ని నమోదు చేసింది. కాగా ఇటీవలే మరో టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ కూడా రూ.8,260 కోట్ల బైబ్యాక్‌ను ప్రకటించింది.