అమరావతి, ఫిబ్రవరి 14: లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. నిన్నటికి నిన్న తెలుగు దేశం పార్టీ(టీడీపీ) చీరాల ఎమ్మెల్యే ఆమంచి రాజీనామా చేసి, వైసీపీ తీర్ధం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. కాగా, ఈరోజు అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ అదే బాటలో వెళ్లనున్నారు. ఆయన కూడా ఈరోజు హైదరాబాద్ లోని లోటస్ పాండ్ కు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ తో భేటీ కానున్నారు. అవంతి శ్రీనివాస్ కు విశాఖపట్నం ఎంపీ స్థానం లేదా భీమిలి టికెట్ కేటాయించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఆ క్రమంలో విశాఖపట్నం ముఖ్య నేతలను జగన్ హైదరాబాద్ కు పిలిపించి సమావేశం కానున్నారు. వారితో మాట్లాడిన తరువాతనే అవంతి శ్రీనివాస్ తో జగన్ సమావేశం అవుతారని తెలుస్తోంది.