హైదరాబాద్, ఫిబ్రవరి 14: ఎక్ష్ ప్రెస్ టీవీ అధినేత చిగురుపాటి జయరాం హత్య కేసులో మరో కోణం వెలుగులోకి వచ్చింది. ఈ కేసును ఇటీవల తెలంగాణకు బదిలీ చేయడంతో విచారణ ముమ్మరంగా సాగుతుంది. ఈ కేసులో జయరాం మేనకోడలు శిఖా చౌదరీని నిందితురాలిగా అనుమానించారు. కానీ హంతకుడు రాకేశ్ రెడ్డి తానే జయరాం ని హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. అయినప్పటికీ ఈ హత్యలో శిఖా చౌదరి పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఆమెతో పాటు ఈ కేసుతో సంబంధం ఉన్న అందరినీ పోలీసులు విచారిస్తున్నారు. విచారణలో తాజాగా నటుడు సూర్య ప్రసాద్ పేరు వినిపిస్తుంది.
ఈ కేసులో సూర్య ప్రమేయం కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సూర్య హంతకుడు రాకేశ్ రెడ్డికి స్నేహితుడు. హత్య జరగడానికి ముందు సూర్య ప్రసాద్ రాకేశ్ తో ఫోన్లో మాట్లాడినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా హత్య జరిగిన రోజున సూర్య రాకేశ్ ఇంటికి వచ్చి వెళ్ళినట్లు విచారణలో వెల్లడైంది. దీంతో బంజార హిల్స్ పోలీసులు నటుడు సూర్య ప్రసాద్ ని పిలిపించి విచారించారు. ఈ హత్యతో సంబంధం ఉన్న మరి కొంతమందిని విచారించానున్నామని పోలీసులు తెలిపారు.