ప. గో. జి, ఫిబ్రవరి 13: ఆంధ్రప్రదేశ్ లో మరో అద్బుతమైన విగ్రహం ఆవిష్కరణకు సిద్ధమవుతోంది. అఖిలభారత శ్రీవాసవీ ట్రస్టు ఆధ్వర్యంలో రూ.100 కోట్లతో పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలోని శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి 90 అడుగుల పంచలోహ విగ్రాహాన్ని నిర్మించారు.
ప్రపంచంలోనే అతిపెద్ద పంచలోహ విగ్రహంగా చరిత్రకెక్కిన ఈ విగ్రహాన్ని ఈనెల 15వ తేదీన ఏపీ సీఎం చంద్రబాబు, మాజీ ముఖ్యమంత్రి రోశయ్య ఆవిష్కరించనున్నారు. 90 అడుగుల అమ్మవారి దర్శనంతోకూడిన విగ్రహం, 165 అడుగుల దేవాలయం, కల్యాణ మండపం, ప్లానిటోరియం, ఉచిత భోజనశాల, వైద్యశాల, గ్రంథాలయం, వృద్ధుల ఆశ్రమం, పుష్కరిణి, వేదపాఠశాల, ధ్యానమందిరం, అద్దాల మండపం ఇక్కడ తీర్చిదిద్దారు.
ఇందులో ఇప్పటికే కొన్ని పూర్తికాగా.. మరికొన్నింటిని పూర్తిచేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం నత్తారామేశ్వరానికి ఏకే ఆర్ట్స్కు చెందిన అరుణప్రసాద్ ఉడయార్, కరుణాకర్ ఉడయార్ సోదరులు 700 రోజులు కష్టపడి ఈ 90 అడుగుల పంచలోహ విగ్రహాన్ని తయారు చేశారు.
ఏ లోహం ఎంత?
ఈ విగ్రహాన్ని 700 రోజుల కష్టపడి నిర్మిచారు శిల్పులు. 65 టన్నుల బరువున్న ఈ విగ్రహంలో 42 టన్నుల రాగి, 20 టన్నుల జింకు, 1.3 టన్నుల తగరం, 600 కేజీల వెండి, 100 కేజీల బంగారం వాడినట్లు తెలుస్తోంది.