హైదరాబాద్, ఫిబ్రవరి 13: తెలంగాణ సీఎం, తెరాస అధినేత కేసీఆర్ ఈనెల 14న చేపట్టిన ఏపీ పర్యటన రద్దు అయ్యింది. దీనికి కారణం వైసీపీ అధినేత జగన్ నూతన గృహ ప్రవేశ కార్యక్రం వాయిదా పడటమే అని సమాచారం. ఏపీలో ఫిబ్రవరి 14న పర్యటించి జగన్ గృహప్రవేశ కార్యక్రమంలో, విశాఖపట్నంలోని శారద పీఠంలో నిర్వహించనున్న రాజశ్యామల యాగంలో పాల్గొనాలని కేసీఆర్ భావించారు. అయితే జగన్ సోదరి షర్మిల అనారోగ్య పాలయ్యారు. కాగా సాంప్రదాయం ప్రకారం నూతన గృహంలో సోదరి పాలు పొంగిచాల్సి ఉంటుంది.
అయితే షర్మిల అనారోగ్యం కారణంగా జగన్ గృహ ప్రవేశం వాయిదా పడింది. దాంతో కేసీఆర్ విశాఖపట్నం పర్యటనను కూడా రద్దు చేసుకున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ప్రతినిధిగా బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి యాగానికి హాజరుకానున్నారు. కాగా రాజశ్యామల యాగానికి కేసీఆర్ హాజరుకావడం లేదని శారదపీఠం నిర్వాహకులకు సమాచారం అందించారు.