అమిత్ బండారీపై దాడి : క్రికెటర్ కు జీవిత కాల నిషేధం

SMTV Desk 2019-02-13 19:32:32  Amit bandari, Anooj dedha, Under 23 Cricket team

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13: కొద్ది రోజుల క్రితం భారత క్రికెట్ జట్టు మాజీ ఆటగాడు అమిత్ బండారీపై జరిగిన దాడికి పాల్పడ్డ వ్యక్తులపై డిసిసిఏ పలు సంచలన నిర్ణయాలు తీసుకుంది. ఈ దాడికి పాల్పడ్డ అనూజ్ దేడాపై క్రికెట్ నుండి జీవితకాల నిషేదాన్ని విధించినట్లు డిసిసిఏ ప్రకటించింది.

వివరాల ప్రకారం టీంఇండియా మాజీ పేసర్ అమిత్ భండారీ ప్రస్తుతం ఢిల్లీ డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్‌(డిడిసీఏ) సెలక్షన్‌ కమిటీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు. అయితే ప్రస్తుతం డిల్లీ అండర్-23 జట్టు ఎంపిక కోసం డిల్లీలోని సెయింట్ జోసెఫ్ మైదానంలో ట్రయల్స్ జరుగుతున్నాయి.

అక్కడ ఆటగాళ్ల ఎంపిక జరుగుతుండగా అమిత్ పై కొందరు యువకులు దాడికి పాల్పడ్డారు. హాకీ స్టిక్స్, ఇనుప రాడ్లు,సైకిల్ చైన్లతో దాడి చేయడంతో అమిత్ తీవ్రంగా గాయపడ్డాడు. అయితే అమిత్ భండారిపై అనూజ్ దేడా అనే యువ క్రికెటర్ దాడి చేయించినట్లు పోలీసులు గుర్తించారు.

తనను డిల్లీ అండర్-23 జట్టులో స్థానం కల్పించకపోవడంతో అనూజ్ తన స్నేహితులతో కలిసి అమిత్‌పై మారణాయుధాలతో దాడికి పాల్పడ్డట్లు పోలీసులు నిర్ధారించారు. దీంతో అనూజ్ దేడాతో పాటు అతడి స్నేహితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

తోటి క్రికెటర్‌పై జరిగిన దాడిపై డిల్లీ ఆటగాడు గౌతమ్ గంభీర్ తీవ్రంగా ఖండిచారు. ఈ దాడితో సంబంధమున్న ఆటగాళ్ళందరిని క్రికెట్ నుండి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఇవాళ డిడిసీఏ సమావేశమయ్యింది. ఈ సమావేశానికి గంభీర్ కూడా హాజరయ్యాడు.

ఈ సందర్భంగా అనూజ్ పై జీవిత కాల నిషేధాన్ని విధించాలని సభ్యులందరు ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్లు డీడీసీఏ అధ్యక్షుడు రజత్ శర్మ వెల్లడించారు. ఈ తీర్మానాన్ని అపెక్స్ కౌన్సిల్ త్వరలో ఆమోదించనుందని...అప్పటి నుండి ఈ నిషేదం అమల్లోకి వస్తుందని ఆయన పేర్కొన్నారు.