పూణే, ఆగస్టు 3 : యువత ఆలోచనలను ప్రభావితం చేయడంలో ఆధ్యాత్మిక దాదా వాస్వానీ ఇచ్చే సందేశాలు ఎంతో మేలు చేస్తాయని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. వాస్వానీ 99వ జన్మదిన సందర్భంగా పూణేలోని ఆయన ఆశ్రమ భక్తులను ఉద్దేశించి దృశ్య మాధ్యమం ద్వారా ప్రసంగించిన ప్రధాని వాస్వానీ ఆధ్యాత్మిక యాత్రను గురించి ప్రసంగించారు. సమాజం మేలు కోసం ఏదైనా మంచి చేయాలన్న ఆయన సందేశాన్ని అందరూ అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. వాస్వానీ అభిమానించే వారంతా సమాజంలో అభివృద్ధిలో పాలుపంచుకోవాలని మోదీ సూచించారు. తన జీవనం, ప్రేమతో నిండిన సందేశం ద్వారా ఆయన ఆధ్యాత్మిక యాత్రను కొనసాగించారని, సమాజం కోసం బతకాలి, జీవితంలో మంచి, చెడు అనే మార్గాలను ఎంచుకునే విషయంలో దాదా వాస్వానీ చాలా మంచి మాటలు చెప్పారని మోదీ కొనియాడారు.