న్యూ ఢిల్లీ, ఫిబ్రవరి 12: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని 11 మందితో కూడిన బృందం ఈ రోజు భారత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ను కలిసింది. వీరంతా ఏపీ భవన్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకు పాదయాత్రగా వెళ్లి 18 డిమాండ్లతో కూడిన లేఖను కోవింద్ కు చంద్రబాబు అందజేశారు. రాష్ట్రపతిని కలిసిన అనంతరం మీడియాతో చంద్రబాబు మాట్లాడుతూ, ఏపీకి న్యాయం జరిగేలా చూడాలని రాష్ట్రపతిని కోరామని చెప్పారు. విభజన హామీలను అమలు చేస్తామని ఎన్నికల సమయంలో మోదీ చెప్పిన విషయాన్ని రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. ప్రధాని మోదీకి నాయకత్వ లక్షణాలు లేవని ఎద్దేవా చేశారు. దేశాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచన మోదీకి లోదని అన్నారు. ఢిల్లీ దీక్షతో ఏపీ ప్రజల బాధను దేశం మొత్తానికి తెలియజేశామని చెప్పారు.