నంద్యాల, ఆగష్టు 3: నంద్యాల ఉపఎన్నికలలో తెలుగుదేశం పార్టీ నుంచి బరిలోకి దిగిన భూమా బ్రహ్మానంద రెడ్డి తన నామినేషన్ బుధవారం వేశారు. దీనికి ముందు భూమా నాగిరెడ్డి ఇంటి నుంచి భారీ ర్యాలీగా పెద్ద ఎత్తున కార్యకర్తలతో కలిసి బయలుదేరి నామినేషన్ కార్యాలయానికి వచ్చారు. బ్రహ్మానంద రెడ్డి ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ తన చిన్నాన భూమా నాగిరెడ్డి ఆశయాలు నెరవేర్చుతానని, మంచి పేరు తీసుకువస్తానన్నారు. తన అన్నయ్య భరోసాకి అకస్మాత్తుగా భూమా అఖిల ప్రియ కంటతడి పెట్టారు. చిన్నాన నాగిరెడ్డి తనకు రెండు విషయాలు నేర్పించారని, మొదటిది ప్రజల ప్రేమను పొందడం, రెండోది ధైర్యంగా ఉండటమని ఆయన తెలిపారు. తండ్రిని గుర్తు చేసినప్పుడు అఖిల ప్రియా కళ్ళు కన్నీరుతో నిండిపోయాయి. చివరగా, తనను ఈ ఉపఎన్నికల్లో ప్రజలు గెలిపిస్తారని ఆశ భావం వ్యక్తంచేశారు.