న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: పార్లమెంట్లో కీలకమైన చర్చల్లో రాఫెల్ డీల్ ఒకటి. దీనిని కాంగ్రెస్ నేతలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈరోజు పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం రాఫెల్ డీల్ పై కాగ్ నివేదికను ముందుంచనుంది. బుధవారం బడ్జెట్ సమావేశాలు ముగియనుండటంతో నేడే కాగ్ నివేదికను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే కాగ్ తన నివేదికను రాష్ట్రపతికి సమర్పించింది.
కాగ్ ఛైర్మన్ రాజీవ్ మహర్షికి రాఫెల్ డీల్ ఒప్పందం వ్యవహారంలో పరస్పర విరుద్ధ ప్రయోజనాలున్నాయని గతంలో కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ ఆరోపించారు. ఆయన ఆడిట్ నుంచి వైదొలగాలని డిమాండ్ చేశారు. కేంద్రమంత్రి అరుణ్జైట్లీ ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. ఇప్పుడు కాగ్పై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని విమర్శించారు.