ఢిల్లీ, ఫిబ్రవరి 11: నేడు ఢిల్లీలో జరుగుతున్న ధర్మపోరాట దీక్షలో అప్ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ. ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లుకు కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్ ఆర్కిటెక్ట్ గా వ్యవహరించారని చెప్పారు. కాగా విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాల్సిందిగా ఆయన చేర్చారని అన్నారు. అలాగే ఏపీకి ఇచ్చిన హామీల అమలు కోసం తాను ఢిల్లీకి వచ్చినప్పుడు జైరామ్ రమేశ్ కూడా తనతో పాటు కేంద్ర మంత్రులందరినీ కలిశారని గుర్తుచేసుకున్నారు. అయితే జైరామ్ రమేశ్ పట్ల చాలామంది కేంద్ర మంత్రులు నిర్లక్ష్యంగా వ్యవహరించారనీ, అయినా దాన్ని రమేశ్ పట్టించుకోలేదని తెలిపారు. ఏపీ విభజన చట్టంలోని హామీలు అమలు అయ్యేలా చూడటం తన బాధ్యత అని జైరామ్ రమేశ్ అన్నారని తెలిపారు. ఈ సందర్బంగా ఆయనపై చంద్రబాబు ప్రశంసల జల్లు కురిపించారు.
ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తాము అధికారంలోకి రాగానే ఆంధ్రాకి ప్రత్యేకహోదా ఇస్తామని ప్రకటించినందుకు ఆయనకు బాబు ధన్యవాదాలు తెలిపారు. జైరామ్ రమేశ్ భార్య ఇటీవల చనిపోయారనీ, అయినప్పటికీ ఆయన ధర్మపోరాట దీక్షకు వచ్చి తన సంఘీభావాన్ని తెలియజేశారని, అందుకు ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నామని చంద్రబాబు అన్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.