అమరావతి, ఫిబ్రవరి 11: ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. తాను పుట్టేనాటికే తాత ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అని, పెరిగేటప్పుడు నాన్న సీఎంగా ఉన్నారని అన్నారు. తాను అమెరికాలో చదువుకున్నాననీ, ప్రపంచ బ్యాంకులో రెండేళ్ల పాటు ఉద్యోగం చేశానని చెప్పారు. కాగా ఇప్పటి వరకు తనపై ఒక్క అవినీతి ఆరోపణగాని, కేసుగాని లేదన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిన్న గుంటూరులో జరిగిన సభలో ‘సన్ రైజ్’ అంటూ విమర్శించడంపై నారా లోకేశ్ స్పందించారు.
తాను రాజకీయాల్లోకి ప్రజలకు సేవ చేయడానికే వచ్చానని పేర్కొన్నారు. దేశంలో ఉపాధి హామీ పథకాల అమలులో ఏపీ అగ్రస్థానంలో ఉందంటే దానికి కారణం సీఎం చంద్రబాబు, ఆయన మంత్రివర్గ పనితీరు అని తెలిపారు. అయితే మనం కట్టిన పన్నులనే నిధుల రూపంలో తిరిగి ఇస్తున్నారనీ, ప్రత్యేకంగా ఏమీ ఇవ్వడం లేదని అన్నారు. ఈసారి అధికారంలోకి రాగానే రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించి తీరుతామని స్పష్టం చేశారు. బీజేపీ, వైసీపీలు కుమ్మక్కు అయ్యి ఏపీ ప్రజలకు నామాలు పెట్టారంటూ వ్యాఖ్యానించారు.