అమరావతి, ఫిబ్రవరి 11: ఢిల్లీలో ఈరోజు జరుగుతున్న ధర్మపోరాట దీక్షలో సందర్బంగా ఓ మీడియా ఛానల్ తో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ జోస్యం చెప్పారు. ఇంకో 75 రోజుల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇంటికి వెళ్లిపోతారని అన్నారు. నిన్న జరిగిన బీజేపీ గుంటూరు సభ కోసం వైసీపీ-బీజేపీ జెండాలున్న ఆటోలతో ప్రజలను తరలించారని పేర్కొన్నారు.
వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు మోదీ సభను విజయవంతం చేయాలని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చెప్పారని లోకేశ్ ఆరోపించారు. ఓ వైసీపీ ఎమ్మెల్యే అయితే ఏకంగా ప్లెక్సీలు కూడా వేశారని విమర్శించారు. మోదీ ఏపీ పర్యటనకు వచ్చి 24 గంటలు అయిన కూడా జగన్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. అలాగే, అవినీతి పరులను 100 రోజుల్లో జైలులో పెడతానని మోదీ చెప్పారనీ, కానీ ఇంకా జగన్ బయట ఎందుకు తిరుగుతున్నారని ప్రశ్నించారు. జడ్జీలను మార్చుతూ జగన్ కేసుల విచారణను మొదటికి తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ ఏపీ ప్రజలను వెన్ను పోటు పొడిచారని మండిపడ్డారు.