అమరావతి, ఫిబ్రవరి 11: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన దీక్ష మరికాసేపట్లో మొదలవనుంది. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుపై కేంద్రం తీరుపై నిరసనగా చేపడుతున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం అంత సిద్దమైంది ఈ ఉదయం 8 గంటలకు ఈ దీక్ష మొదలవనుంది.
ఈ దీక్షలో పాల్గొనేందుకు తరలి వచ్చిన వేలాదిమంది కార్యకర్తలతో ప్రత్యేక హోదా నినాదాలు హోరెత్తనున్నాయి. ఈ దీక్షకు కాంగ్రెస్ సహా పలు జాతీయ పార్టీల నేతలు కూడా హాజరుకానున్నారు. వివిధ పార్టీ నేతలు, విద్యార్థి, ఉపాధ్యాయ, మేధావి సంఘాల ప్రతినిధులు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. దీక్షలో పాల్గొనేందుకు వచ్చిన వారికి 800 గదులు, బస్సులు, భోజన వసతి ఏర్పాటు చేసినట్టు ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాశ్ తెలిపారు. ఈ ఏర్పాట్ల కోసం మొత్తం రూ. 80 లక్షలు ఖర్చు అయినట్టు పేర్కొన్నారు. దీక్ష అనంతరం మంగళవారం మధ్యాహ్నం 12:30 గంటలకు చంద్రబాబు సహా పదిమంది నేతలు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్తో భేటీ అవుతారని ప్రవీణ్ ప్రకాశ్ తెలిపారు.