ముంబై, ఆగస్టు 2 : ప్రముఖ యోగా గురువు రామ్ దేవ్ బాబా త్వరలో ఓ రియాలిటీ షోకు పూర్తిస్థాయి న్యాయనిర్ణేతగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. గతంలో ఆయన `నచ్ బలియే`, `ఇండియాస్ బెస్ట్ డ్రామాబేజ్` రియాలిటీ షోలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం భక్తిరస పాటలను, భజనలను కొత్త తరహాలో వినిపించే `ఓం శాంతి ఓం` అనే రియాలిటీ షోకు ఆయన న్యాయమూర్తి వ్యవహరించనున్నట్లు సమాచారం. ఆయనతో పాటుగా బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా, సంగీత దర్శకుడు శేఖర్ రావ్జియానీ, గాయని కనికా కపూర్ ఈ రియాలిటీ షోకి న్యాయనిర్ణేతలుగా వ్యవహరించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన మొదటి ఎపిసోడ్ షూటింగ్ ఇటీవలే పూర్తయినట్లు తెలుస్తోంది.