అమరావతి, ఫిబ్రవరి 8: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు సాయంత్రం నిర్వహించిన మంత్రి వర్గ సమావేశం ముగిసింది. సమావేశ అనంతరం ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఈ సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగులకు 20 శాతం మధ్యంతర భృతి ఇవ్వాలని, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి హెల్త్ కార్డులు ఇవ్వాలని, విజయనగరం వర్శిటీకి గురజాడ అప్పారావు పేరు పెట్టడం లాంటి పలు నిర్ణయాలు తీసుకున్నట్టు చెప్పారు.
కాగా ఏపీ ప్రభుత్వం అగ్రిగోల్డ్ వ్యవహారంపై తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు అభినందించడంపై, బాధితుల సమస్య పరిష్కారంపై, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆందోళనల్లో పాల్గొన్న వారిపై కేసుల ఎత్తివేతపై, ఏలూరు స్మార్ట్ సిటీ అంశంపై ఈ భేటీలో చర్చకు వచ్చినట్టు గంటా శ్రీనివాసరావు తెలిపారు.