న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: అప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కాన్వాయ్పై ఈరోజు మధ్యాహ్నం కొందరు దుండగులు కర్రలతో దాడికి పాల్పడ్డారు. అయితే ఈ ఘటనలో సీఎం కేజ్రీవాల్ కి ఎటువంటి గాయాలు కాలేదు. ఉత్తర ఢిల్లీలో 25 అనధికార కాలనీల్లో అభివృద్ధి పనులు ప్రారంభించేందుకు కేజ్రీవాల్ వెళుతుండగా నరేలా ప్రాంతంలో దాడి జరిగినట్టు తెలుస్తుంది. కేజ్రీవాల్ కారును ఆపేందుకు సుమారు 100 మంది కర్రలతో ఆయన కారుపై దాడి చేసి కారు అద్దాలు పగులగొట్టేందుకు ప్రయత్నించారు.
సీఎం కేజ్రీవాల్పై గతంలో కూడా దుండగులు దాడికి ప్రయత్నించారు. ఇక గత ఏడాది నవంబర్లో ఢిల్లీ సెక్రటేరియట్లో సీఎం కార్యాలయం వెలుపల కేజ్రీవాల్పై ఓ వ్యక్తి కారం చల్లారు. 2014 లోక్సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా దక్షిణ ఢిల్లీలో జరిగిన రోడ్షోలో ఓ వ్యక్తి కేజ్రీవాల్ చెంప చెళ్లుమనిపించారు. అలాగే హర్యానాలో ఓ రోడ్షోలోనూ కేజ్రీవాల్పై దాడిచేసేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించాడు.