ఏపీని దేశంలో అగ్రరాష్ట్రంగా నిలబెడతా : చంద్రబాబు

SMTV Desk 2019-02-08 20:26:05  Chandrababu, kodela siva prasad rao, ap assembly, ap, tdp, central government

అమరావతి, ఫిబ్రవరి 8: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఈరోజు విజన్ 2029 డాక్యుమెంట్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. టీడీపీ ప్రభుత్వం ఇప్పటివరకు 295 హామీలు అమలు చేసిందని, ఇచ్చిన హామీల కన్నా అధికంగా నెరవేర్చామని అన్నారు. అయితే 2022 నాటికి దేశంలోని మూడు అగ్ర రాష్ట్రాల్లో ఒకటిగా ఉండాలనేది, 2029 నాటికి దేశంలో అగ్రరాష్ట్రంగా ఏపీ ఉండాలనేది తమ లక్ష్యమని స్పష్టం చేశారు. నిర్దిష్ట ఆలోచనతో ముందుకెళ్తే ఏదైనా సాధించగల్గుతామని అన్నారు. అలాగే తాను మొదటిసారి ముఖ్యమంత్రి అయినపుడే విజన్ 2020 తీసుకొచ్చిన విషయాన్ని చంద్రబాబు గుర్తుచేశారు. విజన్ 2020 వల్ల హైదరాబాద్ లో అద్భుత అభివృద్ధి సాధ్యమైందని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ లో కుటుంబ వికాసం, సమాజ వికాసం, సుస్థిర వృద్ధికి కృషి చేస్తున్నామని, ‘హ్యాపీనెస్’ గురించి మాట్లాడుతున్న ఏకైక ప్రభుత్వం టీడీపీనే అని అన్నారు. రైతులకు రూ.1.5 లక్షలు రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం తమదని, అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.5 వేల కోట్లు కేటాయించామని, వృద్ధులు, వితంతువులను పూర్తిగా ఆదుకుంటున్నామని అన్నారు. ట్రాక్టర్లపై త్రైమాసిక పన్ను, ఆటోలపై జీవితకాల పన్ను మినహాయించామని చెప్పారు. అలాగే పట్టిసీమ ద్వారా నదుల అనుసంధానం చేశామని, ఏలేరు ఆయకట్టుకు నీటి సమస్య లేకుండా చేశామని వివరించారు. కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తున్నామని, జూన్ నాటికి గ్రావిటీ ద్వారా నీళ్లు తీసుకొస్తామని, డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని సీఎం అన్నారు.