హైదరాబాద్, ఫిబ్రవరి 08: ప్రముఖ పారిశ్రామికవేత్త చిగురుపాటి హత్య కేసు విషయం గురించి ఆయన మేన కోడలు శిఖా చౌదరి మీడియా ముందుకు వచ్చి పలు సంచలన వ్యాఖ్యలు చేసింది. గురువారం ఓ టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆమె తనపై వస్తున్న ఆరోపణలని ఖండించారు. ఈ హత్య కేసులో తన పాత్ర ఏమాత్రం లేదని స్పష్టం చేశారు. తనను కావాలనే ఈ కేసులో ఇరికిస్తున్నారని ఆమె అన్నారు.
జయరాం జనవరి 29న ఒక ప్రాజెక్ట్ గురించి చర్చించడానికి తన ఇంటికి వచ్చాడని, ఆ తర్వాత డ్రైవర్ ఆయనను ఇంటి దగ్గర డ్రాప్ చేసి వచ్చాడని శిఖా తెలిపింది. తాము చర్చించిన ప్రాజెక్ట్ ఫైల్ జయరామ్ తీసుకువెళ్ళడంతో ఆ ఫైల్ కోసమే తను జయరాం ఇంటికి వెళ్లినట్టు చెప్పారు. తర్వాత జనవరి 30న అమెరికా క్లయింట్ జయరాం కి ఫోన్ చేసాడని, ఈ విషయం జయరాం తనకు మెయిల్ చేసాడని తెలిపారు.
అదేరోజు సాయంత్రం 4:20 గంటలకు మామయ్య తనకు ఫోన్ చేసి కోటి రూపాయలు కావాలని అడిగారని శిఖా తెలిపింది. ఆ తర్వాతి రోజే జయరాం మరణ వార్త తనకు తెలిసిందని, అంతే కానీ ఈ హత్యతో తనకు ఏ సంబంధం లేదని ఆమె అన్నారు.