అమరావతి, ఫిబ్రవరి 08: సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరి రావు తెలుగు దేశం పార్టీ(టీడీపీ)లో చేరాడు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఆదిశేషగిరిరావు టీడీపీలోకి రావడం ఆనందంగా ఉందన్నారు. టీడీపీ వల్లే రాష్ట్రం అభివృద్ధి సాధ్యమని భావించి, ఆయన పార్టీలో చేరినట్టు చెప్పారు. ప్రముఖ హీరో మహేశ్బాబు కూడా టీడీపీకి మద్దతు ఇస్తారని శేషగిరిరావు చెప్పారని చంద్రబాబు పేర్కొన్నారు. శేషగిరిరావు మాట్లాడుతూ, చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని కొనియాడారు. పట్టిసీమ ప్రాజెక్టు వల్ల రాయలసీమ దశదిశ మారిందని, ఏపీ ఇంకా అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు మరో ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండాలని అన్నారు. ఎన్టీఆర్, కృష్ణ అభిమానులు కలిసి టీడీపీని గెలిపించాలని ఆదిశేషగిరిరావు కోరారు.