అమరావతి, ఫిబ్రవరి 08: ఏపిలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న తరుణంలో రాష్ట్ర రాజకీయాలలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా పరిటాల రవి ముఖ్య అనుచరుడు వేపకుంట రాజన్న టీడీపీని వదిలి వైసీపీలో చేరారు. గురువారం జగన్ నిర్వహించిన సమర శంఖారావం సభ తర్వాత తిరిగి వెళ్ళే మార్గ మధ్యలో జగన్ కాన్వాయ్ ను ఆపి రాజన్నకు పార్టీ కండువా కప్పి వైసిపిలోకి సాదరంగా ఆహ్వానించారు. వైసిపిలో చేరిన రాజన్నకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామంటూ పార్టీ అధినేత జగన్ హామీ ఇచ్చారు.
గత కొన్ని రోజులుగా రాజన్న పరిటాల సినీత తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్త్తున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా రాజన్న తెలుగుదేశం పార్టీపై కూడా విమర్శలు చేసారు. చంద్రబాబు ప్రభుత్వంతో పేదలకు న్యాయం జరగలేదని గత నాలుగేళ్ళుగా టిడిపికి దూరంగా ఉంటున్నానని ఆయన చెప్పుకొచ్చారు. ఇటీవల తల్లిమడుగుల గ్రామంలో తన అనుచరులు, టిడిపి నేతల సమక్షంలో నిర్వహించిన సమావేశంలో రాజన్న వైసిపిలో చేరుతున్నట్టు స్పష్టం చేసారు. టీడీపీ ప్రభుత్వంలో ఏ వర్గానికీ న్యాయం జరగలేదనీ, అందువల్లే పేదలకు అండగా నిలిచిన వైఎస్ జగన్ పార్టీలో తన అనుచరులతో పాటు చేరుతున్నట్టు రాజన్న ప్రకటించారు. రాజన్న రాకతో రాప్తాడు నియోజకవర్గంలో పార్టీ బలం పెరుగుతుందని కొందరు వైసిపి నేతలు అభిప్రాయపడ్డారు.