న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముఖంలో ఓటమి భయం కనిపిస్తోందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. భారతీయ జనతా పార్టీ తాను దేశం కంటే గొప్ప అనుకుంటోందని, మరో మూడు నెలల్లో తమ కంటే దేశమే ఉన్నతమైందని ఆ పార్టీకి అర్థమవుతుందని రాహుల్ గాంధీ అన్నారు. కాంగ్రెస్ మైనారిటీ విభాగం జాతీయ సదస్సును ఉద్దేశించి ఈరోజు రాహుల్ మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వాన్ని ఆరెస్సెస్ అధ్యక్షుడు మోహన్ భగవత్ నియంత్రిస్తున్నారని ఆరోపించారు.
కాగా నరేంద్ర మోదీ ప్రభుత్వ పగ్గాలు చేపట్టినట్టు కనిపిస్తున్నా రిమోట్ కంట్రోల్ మోహన్ భగవత్ చేతిలో ఉందన్నారు. వచ్చే మూడు నెలల్లో బీజేపీకి తన స్ధానమేమిటో ప్రజలు చూపబోతున్నారని జోస్యం చెప్పారు. 2017 డోక్లాం ప్రతిష్టంభనను రాహుల్ ప్రస్తావిస్తూ నరేంద్ర మోదీ ఆయన చెప్పుకునేంత ధైర్యవంతుడేమీ కాదని చైనాకూ తెలిసివచ్చిందన్నారు. నరేంద్ర మోదీ తనతో నేరుగా పదినిమిషాలు ఒకే వేదికపై చర్చకు వచ్చి ముఖాముఖి తలపడాలని రాహుల్ సవాల్ విసిరారు.