న్యూఢిల్లీ, ఫిబ్రవరి 07: టీం ఇండియా యువ క్రికెటర్స్ పాండ్య, కేఎల్ రాహుల్ కాఫీ విత్ కరణ్ షో లో పాల్గొని వివాదాల పాలయిన సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరిపై టీం ఇండియా కోచ్ రవి శాస్త్రి పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తప్పులు అందరూ చేస్తారు...అసలు తప్పు చేయని వారు ఎవరూ ఉండరని అలాగే పాండ్య గురించి మాట్లాడుతూ ఎన్ని వివాదాలు అతనిని చుట్టుముట్టినా హీరోలా వాటన్నింటినీ పాండ్యా దాటుకున్నాడని రవిశాస్త్రి అన్నారు.
తన దృష్టిలో నిజమైన హీరో హార్దిక్ పాండ్యా అని ఆయన పేర్కొన్నారు. కాఫీ విత్ కరణ్ వివాదం తర్వాత పాండ్యా కెరీర్ గురించి తాను చాలా బాధపడినట్లు ఆయన చెప్పారు. కానీ పాండ్యా ఇప్పుడు వాటన్నింటినీ తట్టుకొని నిలబడ్డాడని వివరించారు. ఈ షో తర్వాత పాండ్యా మానసిక స్థితిని దెబ్బ తీయాలని చాలా మంది ప్రయత్నించారని ఆయన ఆరోపించారు. కానీ పాండ్యా చాలా త్వరగా దాని నుంచి బయటకు వచ్చాడని చెప్పారు. పాండ్యా నిజమైన హీరో అని అతన్ని మళ్లీ జట్టులోకి తీసుకోవడం తనకు ఎంతో సంతోషం కలిగించిందన్నారు. ఒక కోచ్ గా పాండ్యాని చూసి తాను గర్వపడుతున్నానని ఆయన పేర్కొన్నారు.