తమిళనాడు, ఆగస్టు 2 : తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం భార్య తమ స్వగ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా బావులు తవ్వి, ఇతర రైతులకు ఇబ్బందులకు గురిచేస్తున్నారన్న ఆరోపణలపై దాఖలైన పిటిషన్ ను విచారించిన మధురై హైకోర్టు బెంచ్, విజయలక్ష్మికి నోటీసులు జారీ చేసింది. అసలు విషయంలోకి వెళితే.. వారి స్వగ్రామమైన లక్ష్మీపురంలో 200 అడుగుల లోతుతో ఉన్న బావులను తవ్వి, భూగర్భ జలాలను తమ బావుల్లోకి రాకుండా చేస్తున్నారని, విద్యుత్ బోర్డు నిబంధనలకు విరుద్ధంగా కరెంటును వాడుకుంటూ, నీటిని పక్క గ్రామాలకు తరలిస్తున్నారని కొందరు రైతులు కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో విజయలక్ష్మి తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది, నీటిని తీసుకునేందుకు చీఫ్ ఇంజనీర్ నుంచి అనుమతులు పొందామని చెప్పారు. ఈ కేసులో పిటిషన్ దాఖలు చేయాలని విజయలక్ష్మికి నోటీసులు ఇచ్చిన న్యాయమూర్తి, విచారణను 21వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు తెలిపారు. విద్యుత్ కనెక్షన్లను తొలగించాలని కోరారు.