హైదరాబాద్, ఫిబ్రవరి 07: నట సింహ నందమూరి బాలకృష్ణ అటు రాజకీయాల్లో కొనసాగుతూ ఇటు సినిమా రంగాన్ని కూడా ఏలుతున్నాడు. ఓ పక్క ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రచారంలో జోరు పెంచిన బాలయ్య అదే జోరుతో సినిమాలు కూడా తీస్తున్నాడు. తాజాగా తన తండ్రి ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా ఎన్టీఆర్ కథానాయకుడు అనే సినిమాను విడుదల చేశారు. మరో కొద్ది రోజుల్లో ఎన్టీఆర్ సినిమాలో మరో భాగమైన ఎన్టీఆర్ మహానాయకుడు కూడా విడుదలకు సిద్దంగా ఉంది. అయితే `సింహా`, `లెజెండ్` వంటి బ్లాక్బస్టర్ మూవీస్ తరువాత నటసింహ నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే.
గత చిత్రాల తరహాలోనే యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ సినిమా ఏప్రిల్ నుంచి సెట్స్ పైకి వెళ్ళనుంది. యన్.బి.కె.ఫిల్మ్స్ పతాకంపై బాలకృష్ణ స్వయంగా నిర్మించనున్న ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించనున్నాడట బోయపాటి. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాలో బాలయ్యకి జోడీగా ఇద్దరు క్రేజీ హీరోయిన్స్ నటించనున్నారని టాలీవుడ్ టాక్. వారిలో ఒకరిగా ఇప్పటికే కన్నడ బ్యూటీ శ్రద్ధా శ్రీనాథ్ ఎంపికైందని వార్తలు రాగా మరొకరిగా ఓ స్టార్ హీరోయిన్ నటించనుందని సమాచారం. త్వరలోనే కథానాయికలకు సంబంధించిన వివరాలపై ఫుల్ క్లారిటీ వస్తుంది. 2020 సంక్రాంతికి బాలకృష్ణ, బోయపాటి హ్యాట్రిక్ మూవీ తెరపైకి రానుంది.