హైదరాబాద్, ఫిబ్రవరి 07: బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్ ప్రాధాన పాత్ర పోషించిన సినిమా పింక్ ను తమిళంలో రీమేక్ చేయనున్నారు. కార్తీ ఖాకీ సినిమాకి దర్శకత్వం వహించిన హెచ్. వినోద్ ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమా తమిళ రీమేక్ లో అమితాబ్ బచ్చన్ పాత్రను అజిత్ పోషించనున్నాడు. తాప్సి పాత్రలో శ్రద్ధా శ్రీనాథ్, కీర్తి కుల్హరి పాత్రలో అభిరామి వెంకటాచలం నటించనున్నారు. అజిత్ భార్యగా విద్యాబాలన్ నటించగా, ఈ సినిమాతో శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ దక్షిణాది సినీ పరిశ్రమలో అడుగు పెట్టబోతోంది. అందుచేత ఈ సినిమా నిర్మాణ భాధ్యతలను బోనీ కపూర్ తీసుకున్నారు. కాకపోతే జాన్వి ఈ సినిమాలో అతిధి పాత్రలో మాత్రమే కనిపించనుందని సమాచారం.
ఆమె పాత్ర కోసం కథలో ప్రత్యేకంగా మార్పులు చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంభందించి అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. జాన్వి కపూర్ శ్రీదేవి కూతురుగా బాలీవుడ్ లోకి అడుగు పెట్టి ఒక్క మొదటి సినిమా ధడక్ తో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆమె ప్రస్తుతం తఖ్త్ అనే సినిమాలో నటిస్తుంది. దాంతో పాటు భారత ఎయిర్ ఫోర్స్ మహిళా పైలెట్ గుంజన్ సక్సేనా బయోపిక్లోనూ నటిస్తుంది.