అమరావతి, ఫిబ్రవరి 07: ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పరిణామాలు వేడెక్కాయి. గత 2014 ఎన్నికలలో స్వతంత్రంగా చీరాల ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆమంచి కృష్ణామోహన్ ప్రస్తుతం తెలుగు దేశం పార్టీలో(టీడీపీ) ఉన్నాడు. కానీ తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు ఆమంచి వైసీపీలో చేరేందుకు సిద్దంగా ఉన్నరట.
నియోజకవర్గంలో తనకు వ్యతిరేకంగా ఉన్న వారికి పార్టీ పదవులు కట్టబెట్టడంతో గత కొంతకాలంగా టీడీపీ అధిష్ఠానం పట్ల అలకతో ఉన్న కృష్ణమోహన్ త్వరలో వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే, విషయం తెలుకున్న చంద్రబాబు మంత్రి శిద్ధా రాఘవరావును రంగంలోకి దించాడు. మంత్రి శిద్ధా బుజ్జగింపులకు దిగినప్పటికీ ఆమంచి ససేమిరా అన్నట్లు తెలుస్తోంది. దీంతో మంత్రి నారా లోకేశ్ రంగంలోకి దిగాడు. ఆమంచికి ఫోన్ చేసి చంద్రబాబును ఇవాళ కలవాలని చెప్పారట లోకేశ్. ఆ సందర్భంగా ఆమంచి ఈరోజు చంద్రబాబును కలవనున్నారు. చంద్రబాబుతో భేటీ అనంతరం ఆమంచి వైసీపీలో చేరనున్నారా లేదా అనేది తెలియనుంది.