అమరావతి, ఫిబ్రవరి 07: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 10వ తేదిన గుంటూరులో, 16న విశాఖలో పర్యటించనున్నారు. విభజన హామీలు అమలు చేయకుండా రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న మోదీకి ఖాళీ కుండలతో స్వాగతం పలకాలని ఆంద్రప్రదేశ్ ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన జేఏసీ నిర్ణయించింది. రాష్ట్రానికి అన్యాయం చేసినందుకు ఆయనకు ఖాళీ కుండలతో స్వాగతం పలుకుతామని జేఏసీ పేర్కొంది. జేఏసీ ప్రదర్శనకు టీడీపీ మద్దతు ఇవ్వనుంది. ఈ నెల 11న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో చేపట్టనున్న దీక్షకు సంఘీభావం తెలపాలని పార్టీ కార్యకర్తలు, నాయకులు, విద్యార్థి, ఉద్యోగ, కార్మిక, ప్రజా సంఘాల ప్రతినిధుల్ని తీసుకు వెళ్లనున్నారు. ఈ దీక్ష కొరకు శ్రీకాకుళం, అనంతపురం నుంచి రెండు రైళ్లు బయలుదేరనున్నాయి. అలాగే, ఈ నెల 8న వచ్చీపోయే వాహనాల్ని శుభ్రం చేస్తూ గాంధీగిరి పద్ధతిలో నిరసన తెలపాలని జేఏసీ నిర్ణయించింది.