తిరుపతి, ఫిబ్రవరి 06: 2014లో జరిగిన ఎన్నికల మాదిరే వచ్చే ఎన్నికల్లోనూ ఎవరితో పొత్తుపెట్టుకోబమని, ఒంటరిగానే పోటీ చేస్తామని వైసీపీ అధ్యక్షుడు జగన్ మరోసారి స్పష్టం చేశారు. ఈరోజు తిరుపతిలో నిర్వహించిన ‘సమర శంఖారావం’లో ఆయన మాట్లాడుతూ.. ‘ఆంధ్రప్రదేశ్ హోదా’పై ఎవరు సంతకం పెడతారో వారికే తమ మద్దతిస్తామని మరోసారి చెప్పారు.
కాగా రాబోయే ఎన్నికల్లో 25కు 25 ఎంపీ స్థానాలను మనమే గెలుచుకుందామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీతో సహా అన్ని పార్టీలు రాష్ట్ర ప్రజలను మోసం చేశాయని, ఆ పార్టీలకు ఓటు వేయొద్దని సూచించారు. ఓటు వేయమని చంద్రబాబు డబ్బులిస్తే తీసుకోవద్దని, ఓటు మాత్రం మీ మనస్సాక్షి చెప్పినట్టు వేయాలని సూచించారు. ఉదయించే సూర్యుడు ఎలాగా వస్తాడో, అలాగే, వైసీపీ అధికారంలోకి రాబోతోందని జగన్ ధీమా వ్యక్తం చేశారు.