తిరుపతి, ఫిబ్రవరి 06: ఏపీ లో ఎన్నికల నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు ప్రజలకు వరాల జల్లు కురిపిస్తున్నాయి. ఇక వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి రానున్న ఎన్నికల్లో తమ పార్టీని గెలిపిస్తే వృద్ధులకు ఇచ్చే పింఛన్ ను రెండు వేల నుంచి మూడు వేల రూపాయలకు పెంచుతామని హామీ ఇచ్చారు. ఈరోజు తిరుపతిలో నిర్వహించిన ‘సమర శంఖారావం’లో ఆయన ఈ హామీ ఇచ్చారు. 2019 ఎన్నికల్లో చంద్రబాబు ఒక్కరితోనే పోటీ కాదని, ఎల్లో మీడియా, అన్యాయం, మోసాలతో కూడా పోరాడాల్సిన అవసరం ఉందని అన్నారు.
కాగా ఫిబ్రవరిలో ఎన్నికల షెడ్యూల్ వస్తుందని, ఏప్రిల్ లో ఎన్నికలు ఉంటాయని, ఈ రెండు నెలలు ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని పిలుపు నిచ్చారు. ప్రతి ఓటరు ఓటు వేసేలా బూత్ కమిటీలు బాధ్యత తీసుకోవాలని, చంద్రబాబు ప్రలోభాలకు లోనుకాకుండా చూడాలని అన్నారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు గెలవడంతో తన రెండో సినిమా ప్రారంభించారని, రాష్ట్రాన్ని దోచుకున్నారని, ప్రతి కాంట్రాక్టులోనూ చంద్రబాబుకు కమీషన్లు అందుతున్నాయని వ్యాఖ్యానించారు.