తిరుపతి, ఫిబ్రవరి 06: తిరుపతిలో నిర్వహించిన వైసీపీ ‘సమర శంఖారావం’లో వైసీపీ అధినేత జగన్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు వస్తున్నాయంటే పోలీసులతో గూండాగిరి చేయిస్తారని, వైసీపీ మద్దతుదారుల ఓట్లను తొలగిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇక ఎల్లో మీడియా గురించి చెప్పనక్కర్లేదని, దాని సాయంతో దొంగ సర్వేలు చేయిస్తున్నారని, 59 లక్షల వరకు దొంగ ఓట్లను నమోదు చేయించారని ఆరోపించారు. రానున్న ఎన్నికలు న్యాయానికి, అన్యాయానికి, ఆప్యాయతకు డబ్బుకు మధ్య జరిగేవిగా వర్ణించారు.
ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ... సీఎం చంద్రబాబుపై మండిపడ్డారు. రైతులకు ఆర్థిక సాయమంటూ డ్రామాలాడుతున్నారని, వారి జీవితాలతో ఆటలాడుతున్నారని విమర్శించారు. ఇంకా ఎన్నికలు మూడు నెలల్లో వస్తుండటంతో చంద్రబాబుకు ప్రజలు గుర్తుకొచ్చారని, పెన్షన్ ను రెండు వేల రూపాయలకు పెంచారని, చంద్రబాబు ఎన్నికల్లో గెలిచాక తన సినిమా-2లో డైలాగ్స్ కొడుతున్నారని, అధికారంలో ఉండగా చంద్రబాబుకు బీసీలు గుర్తుకురారని, ఇప్పుడు బీసీ డిక్లరేషన్ అంటూ డ్రామాలాడుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘చంద్రబాబు లాంటి మనిషిని మనం ఏమనాలి? అన్నా’ అనాలా? ‘దున్నా’ అనాలా? అంటూ తీవ్రంగా మండిపడ్డారు.