న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాలనలో దేశంలో అశాంతి నెలకొందని ఆంధ్రప్రదేశ్ టీడీపీ ఎంపీలు విమర్శించారు. ఆంధ్రాకి ఇచ్చిన విభజన హామీలు నెరవేర్చాలంటూ పార్లమెంట్ ఆవరణలో టీడీపీ ఎంపీలు చేస్తున్న ఆందోళన కొనసాగుతోంది. ఈ ఆందోళనలో ‘మోదీ హఠావో దేశ్ బచావో’ అంటూ ఎంపీలు నినాదించారు.
ఈ నేపథ్యంలో ఎంపీ మురళీమోహన్ మాట్లాడుతూ.. పీఎం మోదీ గుజరాత్ తో పాటు తన అనుకూల రాష్ట్రాలకే నిధులు కేటాయిస్తున్నారని, కొన్ని రాష్ట్రాలపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మరో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేయాల్సిన పరిస్థితిని మోదీ తీసుకొచ్చారని అన్నారు.