విజయవాడ, ఫిబ్రవరి 06: దేవినేని అవినాష్ గుడివాడ నుంచి పోటీ చేయనున్నాడంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై అవినాష్ మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు ఎక్కడి నుంచి పోటీ చేయమన్నా తాను సిద్ధమేనని తెలిపారు. దేవినేని అవినాష్ త్వరలో తెలుగు యువత రాష్ట్ర నాయకుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు తనకు అప్పగించిన రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు బాధ్యతలను బుధవారం స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ఈ వేడుకకు చంద్రబాబు కూడా హాజరు కానున్నారని తెలిపారు. రాష్ట్రంలోని యువతను చైతన్యవంతులుగా తీర్చిదిద్ది పార్టీని బలోపేతం చేసి ముందుకు నడపడమే తన ప్రధాన కర్తవ్యమని చెప్పారు. ఇక టీడీపీ సీనియర్ నేత కడియాల బుచ్చిబాబు మాట్లాడుతూ... అన్ని వర్గాల వారిని కలుపుకుంటూ తెలుగుయువత ద్వారా పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యం అని చెప్పారు.