బీమవరం, జనవరి 6: ప్రజాశాంతి పార్టీ అధినేత, మత ప్రచారకుడు కేఏ పాల్... భీమవరం పర్యటనలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఒకరు తనపై దాడి చేశారని ఆరోపించారు. అతడిని ఏపీ పోలీసులు తీసుకెళ్లిపోయారన్నారు. ఇంత జరుగుతున్నా ఏపీ సీఎం చంద్రబాబు తనకు రక్షణ కల్పించడం లేదని మండిపడ్డారు. అయితే తాను కోరగానే తెలంగాణ ప్రభుత్వం పోలీసులను భద్రతగా పంపిందని ప్రశంసించారు. అనంతరం గాడ్ బ్లెస్ తెలంగాణ ప్రభుత్వం, గాడ్ బ్లెస్ పోలీసులు అని ఆశీర్వదించారు. కాగా తన భద్రత గురించి ఎనాడూ భయపడలేదని కేఏ పాల్ స్పష్టం చేశారు.
ఇక 2008, సెప్టెంబర్ 25న తన కైకలూరు టూర్ ను అడ్డగించడానికి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 3,00,000 మందిని పంపారన్నారు. అయిన తాను వెనక్కు తగ్గలేదనీ, కాన్వాయ్ ను వదిలి క్యాప్ పెట్టుకుని బైక్ ఎక్కి ముందుకు వెళ్లానని పేర్కొన్నారు. ఈ ఘటనను అప్పట్లో చాలా ఛానల్స్ లైవ్ గా ప్రసారం చేశాయన్నారు. త్వరలోనే తన బయోపిక్ రాబోతోందని స్పష్టం చేశారు. ప్రజలంతా తప్పకుండ నూటికి నూరు శాతం ప్రజాశాంతి పార్టీకే ఓటు వేయాలని కోరారు.