న్యూఢిల్లీ, ఫిబ్రవరి 06: ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకముందే సామాజిక సేవ చేస్తూ ఉండేది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా పగ్గాలు చేపట్టాక కూడా ఆమె సమాజ సేవ ను మరువలేదు. ఢిల్లీలోని ఔరంగజేబు రోడ్ ప్రాంతానికి చెందిన ఆశిష్ అనే బుద్ధిమాంద్యం ఉన్న బాలుని వైద్యానికి సాయం చేస్తున్నారు ప్రియాంక. ఈ విషయం గురించి ఆశిష్ తండ్రి మాట్లాడుతూ.. ‘ప్రియాంక గాంధీ గత నాలుగేళ్లుగా మా కుమారుని చికిత్సకు సాయం చేస్తున్నారు. ప్రతి రెండు నెలలకు ఒకసారి ప్రియాంక మా ఇంటికి వచ్చి ఆశిష్ను పరమార్శించి.. కాసేపు ముచ్చటించి వెళ్తారు. రాహుల్ గాంధీ కూడా మాకు ఎంతో సాయం చేశారు’ అని చెప్పుకొచ్చారు ఆశిష్ తండ్రి. ప్రియాంక గాంధీలానే రాహుల్ గాంధీ కూడా నిర్భయ సోదరునికి సాయం చేస్తున్నారు. 2012, డిసెంబరులో ఢిల్లీలో జరిగిన నిర్భయ సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన అనంతరం రాహుల్ గాంధీ నిర్భయ కుటుంబానికి అండగా నిలిచాడు. ఈ విషయం గురించి నిర్భయ తండ్రి మాట్లాడుతూ.. ‘కష్ట సమయంలో రాహుల్ గాంధీ మా కుటంబాన్ని చాలా ఆదుకున్నారు. మా కుమారుడు కమర్షియల్ పైలట్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని.. ప్రస్తుతం ప్రైవేట్ ఏయిర్లైన్లో విధులు నిర్వహిస్తున్నాడు. రాయ్బరేలీలోని స్వతంత్ర సంస్థ ఇందిరా గాంధీ రాష్ట్రీయ ఉడాన్ అకాడమీలో నా కుమారుడు పైలట్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్నాడు. ఇందుకు కావాల్సిన ఆర్థిక సాయాన్ని రాహుల్ గాంధీ చేశారు’ అంటు చెప్పుకొచ్చారు.